సుమారుగా ఓ వంద కుటుంబాలున్న
మా ఊళ్ళో, రాయని వాడు పాపి. నాకు తెలిసి, ముగ్గురు సినీ రచయితలు,
నలుగురు నవలా రచయితలు, గేయాలు రాసేవాళ్ళు, కవిత్వాల శాలువా
గాళ్ళు అందరూ కలిపి ఓ పాతిక మంది దాకా ఉంటారు.
మా పెదనాన్న కొడుకులు, బాబాయ్ పిల్లలూ, మేనత్త మొగుళ్ళు, అందరూ
ఏదో ఒకటి రాసి, రచయితో, కవో అనిపించుకున్నారు.
మా మేనత్త కొడుకు కాలేజి మ్యాగజైనులో ప్రేమకథ
పేరుతో ఇంకేదో రాస్తే,ప్రిన్సిపాల్ అది చదివి, విస్తుపోయి, మా మావయ్యకి
కబురు చేశాడు. వాళ్ళ నాన్న, అది చదివి బండ బూతులు తిట్టి చదువు
మాన్పించాడు. తిరిగే కాలూ, బరికే కలమూ, ఊరికే ఉంటాయా? వాడు
ఖాళీగా ఇంటో కూర్చోలేక, క్రితం ఆదివారం, ప్రెసిడెంటు గారి భార్య ఆయన
ఊళ్ళో లేనప్పుడు, ఎవరితో ఏ సిన్మా చూసిందో, పక్కింటి పూజారి గారి
రెండో భార్య, మహానివేదన అయ్యేవరకు ఆకలికి ఆగలేక ,మా ఇంట్లో
కోడికూరతో భోంచేసి, ఆ కూర రుచిని మెచ్చుకుంటూ, మా పెద్దమ్మతో ఏమేం
చెప్పిందో వివరంగా రాసి ఆ న్యూస్ లెటరు లైబ్రరీ గోడల మీద
అతికించేవాడు.
మా దుర్గాగాడు ,కాలేజి
లో తోటి కుర్రాళ్ళకి లవ్ లెటర్లు రాసి పెట్టి ఆ డబ్బుతోనే పిజి చేసాడు.
ఎండా కాలం సెలవల్లో, మా అమ్మ, పెద్దమ్మలు, పిన్నమ్మలు
అచ్చంగిల్లాలు ఆడుకుంటుంటే , ఇంకోపక్కన, మేమందరం శ్రీశ్రీ మహాప్రస్థానం ఏమి
అర్ధం కాకపోయినాసరే,"పదండి ముందుకు, పదండి తోసుకు " అంటూ పెద్దగా
అరుస్తూ బట్టి వేసే వాళ్ళం. అంతెందుకు, "ఝ" కు ఎన్ని కొమ్ములుపెట్టాలో,
ఎక్కడ వత్తు పెట్టాలో తికమక పడే నేను కూడా ఏదో కలంతో
గిలుకుతున్నానంటే మా ఊరి మట్టిలో ఏదో తెలియని శక్తి మమ్మలనందరినీ
దెయ్యం తరిమినట్టు , రాయడానికి పురికొల్పుతుందని, నేను గట్టిగా
నమ్మేవాడిని.నా నమ్మకం తప్పు కాదని ఋజువు చెయ్యడానికి, మా
సువర్చల పిన్ని కథలే ఉదాహరణ. మా సువర్చల పిన్ని పియూసి రెండో
సారి తప్పితే వాళ్ళ నాన్న మా ఆఖరి బాబాయితో ముడిపెట్టేసాడు.ఓ మాదిరి
టౌన్ నుండి వచ్చిన మా పిన్ని చాల ఆధునికంగా ఉంటుందని మా
చెల్లెళ్ళందరూ పిన్ని పిన్ని అంటూ చుట్టూ తిరిగేవాళ్ళు.నడక, నవ్వు,
వయ్యారంగా కూర్చోవడం అంతా వాణిశ్రీ వొంటిమీద కొచ్చినట్లుండేది.
శోభన్ బాబు అంటే పడిచచ్చేది. మా బాబాయిని అలా చూడాలని
ముచ్చట పడేది. జీడిపప్పు,అల్లం వేసిన వేడి వేడి ఉప్మా పెట్టి కాఫీ
ఇచ్చిన తర్వాత పాంటూ చొక్కా వేస్కుని , పొలం వెళ్ళమని పేచి పెట్టేది.
పాతికేళ్ళుగా పొద్దున్నే చద్దన్నం, ఆవకాయ, మీగడ పెరుగు అలవాటున్న
మా బాబాయికి, వేడి ఉప్మా ఇమడక సతమతమయ్యేవాడు.అందుకని,
మా అమ్మ పిల్లలందరికీ చద్దన్నాలు పెడుతుంటే, దొంగ లాగా తినేసి,
మా పిన్ని దగ్గర నాకాకలిగా లేదే, ఉప్మా పొలం దగ్గర తింటాలే
అంటూ,ఇత్తడి క్యారేజిలో పెట్టించు కెళ్ళే వాడు.మా బాబాయిని పంపిస్తూ ,
వెనకనుండి చెయ్యి ఊపుతూ, టాటా చెప్పేది. ఇంక చెప్పేదేముంది,
తోడికోడళ్లందరూ మూతులూ,మెటికలూ విరిచేవాళ్ళు "దీని సోకు మాడ "
అంటూ.
ఓ రోజు నన్ను పిలిచి , ఓ నలభై పేజీల నోట్ బుక్ నాకిచ్చి తను రాసిన
కథ, ఎలాఉందో చదవమంది. ఉప్మా కూడా పెట్టింది. పిన్ని ని బాధ
పెట్టలేక, ఉప్మాలో జీడిపప్పుకు లొంగిపోయి చదవడం మొదలెట్టాను.
రాధ,గోపి, ఒకే కాలేజీలో చదువుతున్నారు.
కథ కోసం ప్రేమించుకుంటున్నారు. రెండు పేజీలకొకసారి లొకేషన్
మారుస్తూ,సిన్మా హాళ్ళలోనూ,పార్కుల్లోనూ, గుడి దగ్గర
కలుసుకుంటున్నారు.పేజీకి రెండుసార్లు, మనిద్దరిదీ అమరప్రేమ అని
తీర్మానించుకుంటూ గాఢంగా, ఇబ్బందికరంగా ప్రేమించుకుంటున్నారు. అవి
చదువుతూ మధ్య మధ్యలో ఉలిక్కిపడుతున్నాను. అది గమనించి
"ఏంటయ్యా, ఏమయ్యింది, ఉప్మాలో పలుకురాళ్ళు వొచ్చాయా" అని
అడిగింది. అలాంటిదే పిన్ని అని జవాబిచ్చి ఆలోచిస్తున్నా. సంతకం తప్ప
చదవడం రాని మా బాబాయి ఎంత అదృష్టవంతుడో కదా అని.
ఇంకా మూడు పేజీలు మిగిలిఉంది అనగా, ఎక్కడినుంచో ఓ బీరకాయ పీచు
చుట్టం ఊడిపడి, వీళ్ళిద్దరికీ మధ్య ఇంకేదో పీచు చుట్టరికాలు కాలిక్యులేట్
చేసి వీళ్ళిద్దరూ వరసకి అన్నా చెల్లెళ్ళవుతారని తేల్చాడు.
తర్వాత కథంతా,ప్రేమ్ నగర్ లో వాణిశ్రీ పెళ్ళికి నాగేస్సర్రావు
శాలువా కప్పుకొచ్చి దీవించే సీను చూసి inspire అయ్యి రాసినట్టుంది.
ఆ సీనులో కూడా, వీళ్లిద్దరూ గాఢo గా సోదర సోదరీ ప్రేమని
వెలిబుచ్చుకున్నారు. ఇది అన్నిటికన్నా ఇబ్బంది గా ఉంది.
నాక్కూడా, బాబాయికి ఉప్మా తిన్నతర్వాత ఎలాఉంటుందో తెలిసింది.